
ఫిర్యాదులు చట్టపరంగా పరిష్కరించాలి
● ఎస్పీ జానకీ షర్మిల
భైంసాటౌన్: అర్జీదారుల ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్లో సూచనలు చేశారు. అనంతరం భరోసా కేంద్రంలో షీ టీమ్ సిబ్బందితో కుటుంబ కలహాల కేసుల్లో ఇరు పార్టీల వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఓ వృద్ధ దంపతులు తమ కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఎస్పీని కలిసి మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన ఎస్పీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపినాథ్, నైలు, మల్లేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి
భైంసాటౌన్: వర్షాకాలం నేపథ్యంలో వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం డీఆర్డీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన మాక్డ్రిల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీఎఫ్ సిబ్బంది విపత్తుల సమయంలో ప్రజలను ఎలా కాపాడాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, సీఐ గోపినాథ్, సిబ్బంది పాల్గొన్నారు.