
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
సారంగపూర్: కౌలురైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. మండలంలోని ఆలూరులో సర్వే నిర్వహించి కౌలురైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో కౌలు రైతుల ఆధీకృత సాగుదారుల చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్రెడ్డి సర్కారు కౌలురైతుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుండడంతో పంటనష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి కౌలురైతుల చట్టాన్ని తీసుకుని వచ్చి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక సభ్యులు రమాకాంత్, రాకేశ్, షారూఖ్, శివాకర్, శ్రీనివాస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.