
‘భూభారతి’తో సమస్యల పరిష్కారం
నిర్మల్చైన్గేట్: భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ఉంటుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ భూభారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్)–2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను కూలంకశంగా అధికారులకు వివరించారు. భూభారతి చట్టంపై ప్రతీ అధికారి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భవిష్యత్లో భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. భూభారతి చట్టం ద్వారా భూసమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. ఈనెల 17 నుంచి అధికారులంతా గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి చట్టంలో పొందుపరిచిన అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల వివరాలు సేకరించాలన్నారు. భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని తెలిపారు. నూతన చట్టం ప్రకారం భూములకు భూదార్ కార్డులు మంజూరు చేసే వెసులుబాటు కల్పించారన్నారు. భూ విషయాలకు సంబంధించి చిన్నచిన్న సవరణల ప్రక్రియ అత్యంత సులువుగా, వేగంగా పూర్తవుతుందని తెలిపారు. సదస్సులో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్