కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు | YSRCP Leaders File Complaint with NHRC Over Kurupam Tribal Hostel Tragedy | Sakshi
Sakshi News home page

కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

Oct 14 2025 4:35 PM | Updated on Oct 14 2025 7:21 PM

YSRCP Leaders File Complaint with NHRC Over Kurupam Tribal Hostel Tragedy

ఢిల్లీ: ఏపీ కురుపాం గిరిజన హాస్టల్‌లో అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యను వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది.

ఈ భేటీలో కురుపాం గిరిజన హాస్టల్ ఉంటున్న భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడినా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యకు ఫిర్యాదు చేశారు.

గిరిజన హాస్టల్స్‌లో పరిశుభ్రమైన మంచినీరు, భోజనం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం  కారణంగా భారీ ఎత్తున పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డారని పేర్కొన్నారు. గిరిజన హాస్టల్స్‌లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘన, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఆందోళన వ్యక్తం చేసస్తూ.. గిరిజన విద్యార్థులను కాపాడాలని వినతి పత్రం సమర్పించారు.

వైఎస్సార్‌సీపీ నేతల బృందంలో ఎంపీ, డాక్టర్  తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర , పరీక్షిత్ రాజు, రేగమ్ మత్స్య లింగం, భాగ్యలక్ష్మి మాజీ ఎంపీ మాధవి, సుభద్ర, శోభా స్వాతి రాణి ఉన్నారు.

అనంతరం తనూజ రాణి మాట్లాడుతూ.. ‘ గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కనీసం పరిశుభ్రమైన  మంచినీరు ఇవ్వలేకపోతోంది  కలుషిత తాగునీరు తాగి 170 మంది గిరిజన విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి  సోకింది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. గిరిజన విద్యార్థులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల అనారోగ్యం  పాలయ్యారని మంత్రి చెప్పడం దౌర్భాగ్యం’ అని  విమర్శించారు. 

పుష్పశ్రీవాణి  మాట్లాడుతూ.. ‘ గిరిజన విద్యార్థులపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది.  ఇద్దరు విద్యార్థులు చనిపోతే ఇప్పటివరకు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 170 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారు. ఆర్వో ప్లాంట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు’ అని మండిపడ్డారు.

రాజన్న దొర మాట్లాడుతూ..  ‘ గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కనీసం మానవత్వం ప్రదర్శించడం లేదు.  గిరిజన విద్యార్థులు పిట్టల రాలిపోతున్న ప్రభుత్వం  చలించడం  లేదు. చనిపోయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు  పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement