డీఎన్ఏ, బయోమెట్రిక్ వివరాలు సేకరించాలి
సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
పలు నేరాల నిరోధానికి అవసరమన్న పిటిషనర్
న్యూఢిల్లీ: తప్పిపోయిన, పోలీసులు సంరక్షించిన బాలల ను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించేందుకు వీలు కల్పించేలా జాతీయ స్థాయిలో డీఎన్ఏ, బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు బుధవారం కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ స్పందనలను కోరింది. రీపక్ కన్సల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
అడ్వకేట్ ఆన్ రికార్డ్ ప్రవీర్ చౌదరీ ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో తప్పిపోయిన, సంరక్షించిన బాలుర బయోమెట్రిక్ వివరాలు, డీఎన్ఏ నమోదులకు కేంద్రీకృత వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలని కోరింది. ఈ వ్యవస్థకు చట్టబద్ధమైన దన్ను, డీఎన్ఏ, బయోమెట్రిక్ వివరాలను సరిపోల్చగల శాస్త్రీయ సామర్థ్యం కూడా ఉండాలని ఈ పిటిషన్లో కోరారు. వేర్వేరు కేసుల్లో రక్షించినప్పటికీ గుర్తించని పిల్లల తాలూకూ డీఎన్ఏ నమూనాల సేకరణను తప్పనసరి చేయాలని, తగిన రక్షణ ఏర్పాట్లు, అనుమతులకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తి చేసింది.
తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి కూడా నమూనాలు సేకరించాలని కోరారు. తద్వారా పిల్లలను వారి అసలైన తల్లిదండ్రులకు అప్పగించడం, వారు ఎవరన్నది గుర్తించడం సులువు అవుతుందని వివరించింది. బాలల సంరక్షణకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు వ్యవస్థల్లోని సమాచారం ఒక్కచోటకు చేర్చాలని, పోలీసు రికార్డులు, షెల్టర్ హోమ్లలోని వివరాలు, బాలల సంరక్షణ కమిటీలు, మానవ అక్రమ రవాణా నిరోధక వ్యవస్థలన్నింటి వద్ద ఉన్న సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేయాలని కూడా ఈ పిటిషన్లో కోరారు. ఈ ఏర్పాట్ల వల్ల దత్తత స్వీకారంలో జరుగుతున్న అక్రమాలను నివారించవచ్చునని పిటిషనర్ వాదించారు.


