ఐసీజీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: మహిళా అధికారికి పర్మనెంట్ హోదా ఇచ్చేందుకు నిరాకరించిన భారత తీర రక్షక దళం(ఐసీజీ)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా అధికారులను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. రెండు వారాల్లోగా ప్రియాంకా త్యాగికి పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ హోదా ఇవ్వాలని, లేదంటే తామే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఐసీజీకి చురకలు అంటించింది. ‘మంగళవారం ఐసీజీ విడుదల చేసిన విధానపత్రం ఏకపక్షం, అస్పష్టం. ఐసీజీ విధానాన్ని తిరస్కరిస్తున్నాం.
ప్రమాణాలకు అనుగుణంగా ఆమె ఎత్తు లేదు, బరువు లేదు అంటూ సాకులు చూపితే ఊరు కోం. ఇటువంటివి మాముందు పనిచేయవు’అని స్పష్టం చేసింది. పురుష అధికారులకు పర్మనెంట్ కమిషన్ హోదా ఇచ్చినప్పుడు, మహిళలకు ఎందుకివ్వరు? మహిళా అధికారులను అవమానిస్తే మేం సహించం’అని ఐసీజీ తరఫున హాజరైన అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం స్పష్టం చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్ఏ) అధికారిగా ప్రియాంకా త్యాగి 14 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. అధికారులు ఆమెకు పర్మనెంట్ హోదా నిరాకరించడంతోపాటు సర్వీసు నుంచి తప్పుకోవాలంటూ ఆదేశించారు. దీనిపై త్యాగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


