
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్లో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.
సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది.
నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.
పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న స్టో రూమ్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…”
పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”
మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని సదరు వ్యక్తి త్రిసభ్య కమిటీకి చెప్పారు.
కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్దమొత్తంలో స్టోరూంలో లభ్యమవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదికలో ప్రస్తావించింది.
జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా కమిటీ విచారించింది. విచారణలో ఈ ఇద్దరూ స్టోరూంలో నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అగ్నిమాపక సిబ్బందిని కోరినట్లు తేలింది.
దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.
దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు.
సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్ను సభ్యులుగా ఉన్నారు.