జల్లికట్టు ఎద్దుకు విగ్రహం

Statue Was Erected At Pudukkottai To Pay Special Homage To Jallikattu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాట సాహసక్రీడ జల్లికట్టుకు ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తూ పుదుకోట్టైలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. జల్లికట్టు ఎద్దు పొగరును క్రీడాకారుడు అణగదొక్కే రీతిలో రూపొందించిన ఈ విగ్రహాన్ని గురువారం సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. సీఎం పళనిస్వామి పుదుకోట్టై పర్యటన నిమిత్తం ఉదయం చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలోమంత్రులు వెల్లమండి నటరాజన్, వలర్మతి, విజయభాస్కర్, తిరుచ్చి కలెక్టర్‌ శివరాజ్‌ సీఎంకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుదుకోట్టైకు సీఎం పయనం అయ్యారు.  (పది రోజుల్లో చిన్నమ్మ విడుదల!)

విరాళిమలైలో ఐటీసీ సంస్థ ఆహార ఉత్పత్తి పరిశ్రమల విస్తరణ పనుల్ని ప్రారంభించారు. అనంతరం విరాళిమలై కామరాజ నగర్‌ జంక్షన్‌లో జల్లికట్టు ఎద్దు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల పుదుకోట్టై జిల్లాలో 110 చోట్ల జరిగిన జల్లికట్టు గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కడంతో, ఆ గుర్తింపుతో పాటు జల్లికట్టు ఎద్దుకు, క్రీడాకారుడికి గౌరవాన్ని కల్పించే విధంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. రంకెలేస్తున్న ఎద్దును లొంగదీసుకునే క్రీడాకారుడి రూపంలో ఈ విగ్రహాన్ని కొలువుదీర్చారు.

ఈ సందర్భంగా బారులు తీరిన జల్లికట్టు ఎద్దులను సీఎం పరిశీలించారు. ఆ ఎద్దుల ముక్కుతాడు పట్టుకున్నారు. ఎడ్లబండిలోకి ఎక్కి, తోలుకుంటూ ముందుకు సాగారు. అక్కడే జరిగిన రైతుల సమస్యల పరిష్కార కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రైతుగా రైతు కష్టాలు తనకు తెలుసునని పేర్కొంటూ, పుదుకోట్టై వాసుల కల త్వరలో సాకారం అవుతుందని ప్రకటించారు. కావేరి – వైగై – గుండారుల అనుసం«ధానం త్వర లో జరిగి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కరోనా, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్షకు సీఎం హాజరయ్యారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top