సీఎం, మాజీ సీఎంలకు షాక్.. కోర్టుకు రండి
ఈపీఎస్, ఓపీఎస్లకు సమన్లు
సాక్షి, చెన్నై: పుహలేంది దెబ్బకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామిలకు ఏర్పడింది. ఆ మేరకు మంగళవారం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా బెంగళూరు పుహలేంది ఇది వరకు వ్యవహరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి తొలగించారు. తనను అకారణంగా తొలగించారంటూ కోర్టు తలుపుల్ని పుహలేంది తట్టారు.
ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఈ పిటిషన్ మంగళవారం చేరింది. వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ పన్నీరుసెల్వం, పళనిస్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు. విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. అయితే ఈ ఆదేశాలపై స్టే కోరడమే కాకుండా, పిటిషన్ విచారణ యోగ్యం కాదని ప్రకటించాలని కోరుతూ మరో కోర్టులో పిటిషన్ల దాఖలకు అన్నాడీఎంకే సన్నద్ధం అవుతోంది.