ముగిసిన సూర్యగ్రహణం
దేశంలోని కొన్ని చోట్ల సూర్య గ్రహణం 4.29 గంటల సమయంలో మొదలై గరిష్ఠంగా గంటా 45 నిమిషాల పాటు కనిపించింది. సాయంత్రం 6.26 గంటలకు గ్రహణం పూర్తయింది. ఢిల్లీ, జమ్ము, అమృత్సర్, వారణాసి వంటి చోట్ల సూర్య గ్రహణం ముందుగా కనిపించింది. ఆయా ప్రాంతాలను బట్టి సూర్య గ్రహణం సమాయాల్లో తేడాలు ఉన్నాయి. హైదరాబాద్లో సాయంత్రం 4.58 గంటల నుంచి 5.55 గంటల వరకు సూర్య గ్రహణం కనిపించింది. బిర్లా ప్లానిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. గ్రహణం వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు సందర్శకులు.
గ్రహణం మధ్యకాలం సాయంత్రం 5.29 గంటలుగా నిపుణులు తెలిపారు. గాగుల్స్ పెట్టుకుని మాత్రమే గ్రహణం వీక్షించాలని సూచించారు. 22 ఏళ్ల తర్వాత ఏర్పడిన అరుదైన గ్రహణం కావటంతో చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి.