Shashi Tharoor Interesting Comments On Congress Leaders And BJP, Details Inside - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలు బీజేపీవైపు ఆకర్షితులవుతున్నారు.. శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! 

Oct 16 2022 9:57 AM | Updated on Oct 16 2022 10:22 AM

Shashi Tharoor Interesting Comments On Congress Leaders And BJP - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, సోమవారం.. అధ్యక్ష ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అయితే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శశిథరూర్‌ మాట్లాడుతూ తన భవిష్యత్‌ ప్రణాళికను తెలిపారు. తాను గ‌నుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు బీజేపీలోకి వెళ్ల‌కుండా అడ్డుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం పార్టీలో ఎక్కువ మంది అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని వెల్లడించారు. ఈ విషయంలో తన వద్ద ప్లాన్స్‌ ఉన్నాయంటూ కామెంట్స్‌ చేశారు. అలాగే, ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్‌తో పాటు హైక‌మాండ్ క‌ల్చ‌ర్ అనేది లేకుండా చేస్తాన‌ని తెలిపారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో నిలిచిన మల్లికార్జున ఖర్గేపై కూడా శశథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని అన్నారు. తామేమీ శత్రువులం కాదన్నారు. నాకు మద్దతిచ్చిన వ్యక్తులు తిరుగుబాటుదారులు కాదు, గాంధీలకు వ్యతిరేకం కాదు.. ఇది తప్పుడు భావన. గాంధీలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉంటారు, మేం కూడా ఉంటాం.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సంతోషమే.  గెలుస్తామనే స్ఫూర్తితోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ విజయం. ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచినా పార్టీ కోసం ప‌ని చేయాల్సిందేన‌ని స్పష్టం చేశారు. 

మరోవైపు.. పార్టీ హైకమాండ్‌ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్‌ ఉన్నప్పటికీ.. ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement