బిల్‌ ఎంత పని చేసింది!.. రెస్టారెంట్‌లో కొట్టుకున్న సిబ్బంది, కస్టమర్లు! | Restaurant Staff, Customers Clash Over Service Charge At Noida Mall | Sakshi
Sakshi News home page

బిల్‌ ఎంత పని చేసింది!.. రెస్టారెంట్‌లో కొట్టుకున్న సిబ్బంది, కస్టమర్లు!

Jun 19 2023 9:14 PM | Updated on Jun 19 2023 9:35 PM

Restaurant Staff, Customers Clash Over Service Charge At Noida Mall - Sakshi

సాధారణంగా అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్‌ని ఆరగించడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. బిల్లు ఎక్కువైనా పర్లేదు కడుపు నిండా తినాల్సిందేనని కొందరు తెగ లాగించేస్తుంటారు. ఇదే తరహాలో ఓ కుటుంబం కూడా రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేసింది. అంతా అయ్యాక, వెయిటర్ బిల్లు తెచ్చాడు. బిల్లు చూసి ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆహార పదార్థాలే కాకుండా బిల్లుపై సర్వీస్ చార్జీలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.

రూ. 970 సర్వీస్ ఛార్జీ ఎందుకు విధించారని, హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో హోటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు ట్వీట్‌ రూపంలో తమకు చేదు అనుభవాన్ని నెటిజన్లకు ఇలా పంచుకున్నారు.. “ఈరోజు మేము నా కుటుంబంతో కలిసి నోయిడాలోని స్పెక్ట్రమ్ మాల్, సెక్టార్-75లో ఉన్న రెస్టారెంట్ ఫ్లోట్ బై ఫ్యూటీ ఫ్రీకి వెళ్లాం. ముందుగా సిబ్బంది మెనూ కార్డ్‌లో ఉన్న కొన్ని పుడ్‌ ఐటమ్స్‌ను ఆర్డర్‌ చేస్తే.. అవి లేవని చెప్పాడు.

సరే అని మేము సర్దుకుని రెస్టారెంట్‌లో ఉన్న అందుబాటులో ఉన్న ఆహారాన్ని తెప్పించుకుని తిన్నాము. కాసేపు అనంతరం రెస్టారెంట్‌ సిబ్బంది మా భోజన ఖర్చుకు సంబంధించిన బిల్లు తీసుకువచ్చి మా ముందు ఉంచాడు. అయితే సర్వీస్ ఛార్జీ ఎక్కువగా ఉందని.. దాన్ని తొలగించి బిల్‌ ఇవ్వమని కోరాము. కానీ సిబ్బంది కుదరదంటూ మొండిగా వాదించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి నా సోదరుడిపై దుర్భాషలాడడంతో పాటు నాపై కూడా దాడి చేశాడని వాపోయాడు.

చదవండి: అమర్‌నాథ్‌ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేస్తే..

Advertisement
 
Advertisement
Advertisement