
భువనేశ్వర్: తనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్కు ఆహ్వానించినా అందుకు వెళ్లలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించి, ధన్యవాదాలు తెలిపానన్నారు.
తనకు ఒడిశాలో ప్యూరీ జగన్నాథ్ పుణ్యభూమికి వెళ్లడం ముఖ్యమని ట్రంప్కు చెప్పినట్లు మోదీ తెలిపారు. ఈ రోజు(శుక్రవారం, జూన్ 20) ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. సుమారు 18 వేల కోట్ల విలువైన 100కు పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు.
‘నాకు ట్రంప్ నుంచి డిన్నర్ ఆహ్వానం అందింది. నేను జీ-7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు నన్ను వాషింగ్టన్కు రమ్మని ట్రంప్ ఆహ్వానించారు. అయితే మహాప్రభు జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లే అవసరం ఉండటంతో నేను ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను.
రెండు రోజుల క్రితం కెనడా పర్యటనలో ఉన్నపపుడు వాషింగ్టన్ మీదుగా రమ్మని ట్రంప్ అన్నారు. కలిసి డిన్నర్ చేసి మాట్లాడుకుందాం అన్నారు. కానీ అంతకంటే ఎక్కువగా ఒడిశా జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పా’ అని మోదీ తెలిపారు.
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంలో తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారాయన.
#WATCH | Bhubaneswar, Odisha: "Just two days ago, I was in Canada for the G7 summit and the US President Trump called me. He said, since you have come to Canada, go via Washington, we will have dinner together and talk. He extended the invitation with great insistence. I told the… pic.twitter.com/MdLsiYnNCQ
— ANI (@ANI) June 20, 2025
ఏడాది విజయవంతంగా పూర్తయ్యింది
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుందని కొనియాడారు. ఇది తమకు చాలా ప్రత్యేకమైన రోజన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం ఒక్కటే కాదు.. మంచి పరిపాలన అందించినందుకు కూడా తొలి వార్షికోత్సవమన్నారు. ఏడాది కాలంలోనే బీజేపీ ప్రజల నమ్మకాన్ని చూరగొందని మోదీ పేర్కొన్నారు.