PM Modi : పది రూపాయల స్నాక్‌.. పది కోట్ల వ్యూస్‌ | PM Modi Enjoys Jhal Muri Street Food in Jhargram During Campaign | Sakshi
Sakshi News home page

PM Modi : పది రూపాయల స్నాక్‌.. పది కోట్ల వ్యూస్‌

Apr 21 2026 3:28 PM | Updated on Apr 21 2026 5:19 PM

PM Modi Enjoys Jhal Muri Street Food in Jhargram During Campaign

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 21న జహాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభ అనంతరం హెలిప్యాడ్‌ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన ఝల్‌మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

ఈ సంఘటనతో ఆ దుకాణం యజమాని విక్రమ్‌ కుమార్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. మోదీ రాకతో నేను ఓవర్‌నైట్‌లో ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారాను అని విక్రమ్‌ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్‌కాల్స్‌ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. కస్టమర్లతో పాటు రీల్స్‌ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు కూడా పెరిగారని చెప్పాడు.

ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్‌మురి ధర కేవలం రూ.10 మాత్రమేనని విక్రమ్‌ వెల్లడించాడు. మోదీ షేర్‌ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్‌, ఫేస్‌బుక్‌లో 11 కోట్ల వ్యూస్‌ దాటింది. అంతేకాదు, ఝల్‌మురి కోసం గూగుల్‌లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్‌లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్‌ వైపు వెళ్తున్నప్పుడు నా స్టాల్‌ వద్ద ఆగారు. ఝల్‌మురి ధర ఎంత అని అడిగారు. నా నేపథ్యం, చదువు గురించి తెలుసుకున్నారు. నేను తొమ్మిదో తరగతి వరకు చదివానని చెప్పాను’అని విక్రమ్‌ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్‌ మీడియాలో ‘జహాగ్రామ్‌లో మసాలా ఝల్‌మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఈ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ ఒక్క క్షణం వెనుక విక్రమ్‌ కుటుంబం దీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం వారు బీహార్‌ నుంచి జహాగ్రామ్‌కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి రాజ్‌ కాలేజ్‌ మోర్‌ వద్ద ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే శాశ్వతంగా ఝల్‌మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కుటుంబం జహాగ్రామ్‌లోని బఛ్ఛుర్దోహా ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంది. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్‌ తెలిపారు. ఇప్పుడు తన దుకాణం రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement