కర్ణాటక: రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది, సిలిండర్లు దొరకడం గగనమైన తరుణంలో గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీ బోల్తాపడిన సంఘటన గదగ్ జిల్లా రోణ పట్టణ శివారులో జరిగింది. హుబ్లీ నుంచి రోణ, గజేంద్రగడ మీదుగా కుష్టగి పట్టణానికి భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ రోణ శివార్లలో మలుపులో ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. దీంతో గ్యాస్ సిలిండర్లు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అదృష్టవశాత్తు అంతకుమించి జరగలేదు. ఎవరూ సిలిండర్లు ఎత్తుకుపోకుండా రోణ పోలీసులు బందోబస్తు కాశారు.
గ్యాస్ సిలిండర్ల చోరీ
బొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకాలోని సూర్య సిటీలో బి–కాంపొనెంట్లో సిలిండర్ దొంగతనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు రెండు ఇళ్ల నుంచి మూడు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఓ ఇంటివారు ఫుల్లు సిలిండర్ను తీసుకుని ఇంటి కిందిభాగంలో ఉంచారు. మరో రెండు ఇళ్లలోనూ సిలిండర్లు ఉన్నాయి. దీనిని కనిపెట్టిన దొంగలు వరుసగా సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఇద్దరు బైక్పై వచ్చారు, హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి వాటిని తీసుకెళ్లడం సీసీ కెమెరాలలో రికార్డయింది. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి దొంగతనాలు పెరిగాయి. మేం సురక్షితంగా జీవించగలమా అనే ప్రశ్న తలెత్తుతోంది అని స్థానిక నివాసి పూర్ణేష్ రెడ్డి వాపోయారు.


