చొరబాటుదార్లకే ప్రాధాన్యమిస్తోంది: మోదీ
బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 15 ఏళ్ల పాలనలో దోపిడీలో పీహెచ్డీ చేసిందని ధ్వజమెత్తారు. చొరబాటుదార్ల అభివృద్ధిలోనే తృణమూల్కు అమితాసక్తి ఉందని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలతో యువత, మహిళలు, రైతన్నలను పూర్తిగా నిర్లక్ష్యంగా చేసిందని ఆరోపించారు.
చొరబాటుదార్ల ఓట్లతో కేవలం వారి మేలుకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ భావిస్తోందని మండిపడ్డారు. ప్రధాని ఆదివారం బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారాయణ్గఢ్, పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈసారి పోటీ తృణమూల్ లూటీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు, బీజేపీ అభివృద్ధి ఎజెండాకు మధ్యేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కోరితే బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇవి బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలన్నారు.
అభివృద్ధి జాడే లేదు
‘‘భారత్ 3జీ నుంచి 5జీకి ఎదిగింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ మన దేశంలోనే ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాం. బెంగాల్లో మాత్రం అభివృద్ధి జాడే లేదు’’ అంటూ మోదీ దుయ్యబట్టారు. ‘‘మమత పాలనలో అవినీతి, ఉద్యోగాల కొరత తప్ప ఇంకేమీ లేదు. ఉపాధి లేక బెంగాల్ మహిళలు ఢిల్లీ, ముంబై వలస వెళ్లాల్సి వచ్చింది. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను చొరబాటుదార్లకు తృణమూల్ పంచిపెడుతోంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ దోపిడీని అడ్డుకుంటాం. ఇది నా హామీ!
తృణమూల్ దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర సామాజిక స్వరూపాన్నే మార్చేశాయి. చొరబాట్లతో బెంగాల్ భాష, సంస్కృతి మారిపోతున్నాయి. మమత ప్రభుత్వం గిరిజన భాషలను, గుర్తింపును అవమానిస్తోంది. మదర్సాలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తూ సంతాలీ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. గిరిజనుల భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. తృణమూల్ నేతలకు లంచమివ్వనిదే ఒక్క పనీ జరగడం లేదు. లంచాల సంస్కృతిని తట్టుకోలేక పరిశ్రమలు రాష్ట్రం వీడాయి. అవినీతితో ఉపాధి సంక్షోభం పెరిగింది. ఉద్యోగాల్లేక యువత అలమటిస్తోంది’’ అని విమర్శించారు.
మహిళలకు తీరని ద్రోహం
మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదానికి లోక్సభలో తెచ్చిన బిల్లును అడ్డుకుని మహిళలకు తృణమూల్ తీరని ద్రోహం చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘2029 నుంచే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళల ఆకాంక్షలతో కాంగ్రెస్తో కలిసి తృణమూల్ సమాధి కట్టింది. తద్వారా బెంగాల్ సోదరీమణులనూ దగా చేసింది. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. కొన్ని జిల్లాల్లో టీఎంసీ ఒక్క సీటూ గెలవదని నా రాజకీయ అనుభవంతో చెప్పగలను’’ అన్నారు. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. మాతృశక్తి భరోసా పథకం కింద వారికి ఏటా రూ.36,000, గర్భిణులకు రూ.21,000, కుమార్తెల చదువుకు రూ.50,000 ఇస్తాం. వరి మద్దతు ధర క్వింటాల్కు రూ.3,100కు పెంచుతాం’’ అని హామీ ఇచ్చారు.
ఝాల్మురీ రుచికిమోదీ ఫిదా
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. రుచెలా ఉందని దుకాణదారు ప్రశ్నించగా ఉప్పు తప్ప అన్నీ బాగున్నాయని బదులిచ్చారు. ఆరోగ్యం దృష్ట్యా తాను ఉప్పు వాడడం లేదని చెప్పారు. ఝాల్మురీ ఆరగిస్తున్న ఫొటో, వీడియోను మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


