హుగ్లీ నదిలో మోదీ పడవ ప్రయాణం | PM Modi boat ride with camera in hand, shares Hooghly pictures | Sakshi
Sakshi News home page

హుగ్లీ నదిలో మోదీ పడవ ప్రయాణం

Apr 24 2026 10:46 AM | Updated on Apr 24 2026 10:57 AM

PM Modi boat ride with camera in hand, shares Hooghly pictures

ప్రధాని మోదీ కాసేపు సేదతీరారు.  శుక్రవారం ఉదయం కోల్‌కతాలోని హుగ్లీ నదిలో ప్రధాని మోదీ బోటింగ్ చేశారు. చెక్కపడవపై కూర్చోని హుగ్లీనదిలో పయనించారు. దానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.  

భారత ప్రధాని బిజీ షెడ్యూల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల పనులతో అనునిత్యం బిజీబిజీగా ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం మాత్రం కొంత తీరిక చేసుకొని కోల్‌కతా హుగ్లీనదిలో పడవ ప్రయాణం చేశారు. చేతిలో కెమెరా పట్టుకొని ప్రకృతికి సంబంధించిన చిత్రాలు తన కెమెరాలో బంధించారు. ఈ వివరాలను తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా గంగామాతకు కృతజ్ఞతలు చెప్పారు "ప్రతి బెంగాలీ హృదయంలో గంగా నదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గంగమ్మ బెంగాల్ ఆత్మలో ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం హుగ్లీ నది ఒడ్డున గడిపి, మా గంగకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం లభించింది" అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే ఉదయం సమయంలో వాకింగ్‌కు వచ్చిన ప్రజలతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. పడవలు నడిపే వారితోనూ మాటామాటా కలిపి బాగోగులు తెలుసుకొని వారి కష్టపడే తత్వాన్ని ప్రధాని అభినందించారు. పశ్చిమ బెంగాల్‌ని ఎ‍ట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసి తీరుతామని బెంగాలీ ప్రజల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

అయితే పశ్చిమబెంగాల్‌లో నిన్న గురువారం రోజే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓట్లు వేయడంతో 90 శాతంకు పైగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement