
నిర్మాత సునీల్ నారంగ్ తీసిన 'కుబేర'.. థియేటర్లలో రిలీజై జనాదరణ పొందుతున్న సందర్భంగా ఆయన మిత్రుడు, నిర్మాత-దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సునీల్ ఇంతా మంచి సినిమా తీయ్యడంతో సంతోషంగా ఉందని, చాలా రోజుల తరువాత ఓ మంచి మూవీ చూసిన అనుభూతి ప్రేక్షకులకు వచ్చిందని చెప్పారు. సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 'కుబేర' ఊరట కల్పించిందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు.
'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వేసవిలో తెలుగు సినిమా మసక బారిందని, ఇప్పుడు దాదాపు ఐదారు నెలల తర్వాత కుబేర సినిమాతో కాస్త జనం థియేటర్లకు రావటం చూస్తుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి చిత్రాన్ని ఆదరిస్తారనే విషయం మరోసారి తేటతెల్లం అయ్యిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమ.. ప్రేక్షకుడి అభిరుచిని గుర్తెరిగి మంచి సినిమాలను నిర్మించాలని.. అప్పుడే ప్రేక్షకులు ఓటీటీలకు కాకుండా థియేటర్ల వైపు వస్తారని కేతిరెడ్డి తెలిపారు.