టాలీవుడ్లో ఇప్పుడో చిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. స్టార్ హీరోల్లో చాలామంది ఒక్క సినిమా కోసం ఏకంగా ఏళ్లకు ఏళ్లు పనిచేస్తారు. పోనీ ఆ మూవీ సరిగా ఉంటుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు ఏడాదిలో రెండు మూడు చిత్రాలు చేసిన హీరోలు కూడా ఫెర్ఫెక్షన్ పేరిట టైమ్ అంతా వృథా చేస్తున్నారు. అదే టైంలో తెలుగు హీరోల్లానే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మాత్రం ఒంటి చేత్తో మూడు బాధ్యతల్ని అద్భుతంగా పూర్తి చేస్తున్నాడు. ధనుష్ వల్ల అవుతున్న ఆ పని.. మిగతా హీరోల వల్ల ఎందుకు కావట్లేదు?
(ఇదీ చదవండి: స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్: తమిళ సింగర్)
చాలామందికి ధనుష్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఇతడిలో ఓ డైరెక్టర్, నిర్మాత కూడా ఉన్నాడు. గడిచిన 15 నెలలు తీసుకుంటే.. గతేడాది ప్రారంభంలో తన మేనల్లుడు పవిష్ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీశాడు. దీనికి దర్శకుడు నిర్మాత ధనుషే. ఇది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆకట్టుకుంది. ఇక వేసవిలో 'కుబేర'తో వచ్చాడు. బిచ్చగాడి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేశాడు. దసరా వచ్చేసరికి 'ఇడ్లీ కొట్టు' మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ చిత్రం కోసం హీరో, డైరెక్టర్, నిర్మాతగా మూడు బాధ్యతల్ని నిర్వర్తించాడు. తెలుగులో ఇది ఫెయిలైనప్పటికీ తమిళంలో సూపర్ హిట్ అయింది.
గతేడాద చివరలో 'తేరే ఇష్క్ మై' అనే హిందీ సినిమాలో హీరోగా నటించాడు. రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగు నెలలు తిరిగేసరికల్లా 'కర' మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు. దీని ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.
అయితే ఏడాదిన్నర కాలంలో ధనుష్.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఐదు సినిమాలు చేశాడు. మరి ఇతడి వల్ల అవుతున్న పని మిగతా హీరోలకు ఎందుకు సాధ్యం కావడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఫెర్ఫెక్షన్ పేరు చెప్పి ఆలస్యం చేయడమనేది ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. ఎందుకంటే రెగ్యులర్గా సినిమాలు చేస్తేనే సినిమా మీద ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అలానే రెగ్యులర్ టచ్లో ఉంటే ఆడియెన్స్ కూడా సదరు హీరోల చిత్రాల్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఈ విషయాన్ని తెలుగు, తమిళ హీరోలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో?
(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర)


