సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం, డీజిల్ కొరత, ఎల్పీజీ సరఫరాలో అంతరాయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ ఫిర్యాదు చేశారు.
ప్రజల దైనందిన జీవనానికి, వ్యవసాయానికి మూలాధారమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత వల్ల అంబులెన్సులు, అత్యవసర వైద్యసేవలు, ప్రజారవాణా, ఆహార సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంధన కొరత సృష్టించడం ప్రాథమిక హక్కులతో పాటు వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఈ కృత్రిమ కొరతను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
జిల్లాల వారీగా ఇంధన నిల్వల వివరాలను పారదర్శకంగా వెల్లడించటంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే బంకులు, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిల్వల పర్యవేక్షణకు ఆటోమేటిక్ ట్యాంక్ గేజింగ్ (ఏటీజీ) వ్యవస్థ, బంకుల వద్ద స్టాక్ తెలిసేలా పబ్లిక్ డ్యాష్బోర్డ్, ఆన్లైన్ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షించి ఇంధన సరఫరాను గాడిలో పెట్టాలని ఆయన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.


