
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్కు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం గోరంట్లను ఢిల్లీకి పిలిపించిన సీబీఐ అధికారులు మంగళవారం సాయంత్రం ఆయనని అదుపులోనికి తీసుకున్నారు. బుచి్చబాబు విచారణకు సహకరించడంలేదని, అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తూ ఉండడంతో అరెస్ట్ చేసినట్టుగా బుధవారం సీబీఐ అధికారులు తెలిపారు.
ఢిల్లీ కొత్త మద్యం విధానం 2021–22 రూపకల్పనలో గోరంట్ల బుచి్చబాబు పాత్ర ఉందని హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా ఆయన వ్యవహరించారని సీబీఐ ఆరోపిస్తోంది. ప్రత్యేక కోర్టులో ఆయనని హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు కస్టడీకి అప్పగించింది. బుచి్చబాబుని సీబీఐ గతేడాది ఆగస్టు, అక్టోబర్ మధ్య కాలంలో 15 సార్లు విచారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు కూడా విచారణ జరిపింది.