ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎన్డీఏ నాయకులు తప్పుబట్టారు. మోదీ మెజీషియన్ అంటూ రాహుల్ వ్యాఖ్యనించడంతో లోక్సభలో శుక్రవారం మధ్యాహ్నం గందరగోళం రేగింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని అధికార సభ్యులు డిమాండ్ చేయడంతో సభ దద్దరిల్లింది. సభ వెలుపల పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ తీరును తప్పుబట్టారు.
లోక్సభలో రాహుల్ గాంధీ న్యూసెన్స్ చేశారని ఫైర్ అయ్యారు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. పార్లమెంట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం తలనొప్పి తెప్పించిందని, ఆయన మాటలు ఇబ్బందికరంగా అనిపించాయన్నారు. సభాపతి కూడా ఆయన్ను ఆపమన్నారని తెలిపారు. పార్లమెంట్ ప్రతిష్టను రాహుల్ అపహాస్యం చేశారని కంగన ఫైర్ అయ్యారు.
రాహుల్ హద్దులు దాటారు: చిరాగ్
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హద్దులు దాటారని.. ఆయన ప్రసంగం తనకు నిరాశ కలిగించిందని కేంద్ర మంత్రి, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ పనికిరారని అన్నారు. "రాహుల్ ప్రసంగం ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని తగ్గించేలా ఉంది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హద్దులు దాటారు. మీ పార్టీలో తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికి మీరెలాంటి ఉదాహరణ ఇస్తున్నారు? సొంత ఎంపీల ముందే తనను తాను నవ్వులపాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుంది, కానీ ప్రతిపక్ష నాయకుడు తనను తాను అపహాస్యం చేసుకోవాలనుకుంటే, కేవలం హాస్య ప్రసంగాలు చేయాలనుకుంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడని నేను అనుకోను అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.
కరెక్ట్ కాదు: హేమమాలిని
ప్రధానమంత్రిని ఇంద్రజాలికుడు అని పిలవడం సరికాదని సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అందులో నిర్దిష్టమైన విషయం ఏమీ లేదని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు స్పందిస్తూ.. మెజీషియన్ అనే పదం అనుచితమైంది కాదని స్పష్టం చేశారు.
చదవండి: నాకు, మోదీకి భార్యల సమస్య లేదు.. రాహుల్ సరదా కామెంట్స్


