
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా..
భారత వాతావరణ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి దేశంలో మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలియజేశారు.
సాధారణ వర్షపాతానికి 30 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 33 శాతం, సాధారణం కంటే అత్యధిక వర్షపాతానికి 26 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ స్పష్టంచేసింది.
తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మొత్తం సీజన్లో ఎల్నినో పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని తెలియచెప్పింది. 1971 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లుగా నమోదైందని ఐఎండీ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీకల్లా కేరళలో ప్రవేశిస్తుంటాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా రుతుపవనాల సీజన్ ముగుస్తుంది.