
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది.
గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.