సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: మామ మరణం తర్వాత ఆయన ఆస్తి నుంచి భరణం పొందే హక్కు హిందూ దత్తత, పోషణ చట్టం (హెచ్ఏఎంఏ)–1956 ప్రకారం వితంతువుకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎన్వీఎన్ భట్టి ధర్మాసనం మంగళవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు మహిళ భర్త ఆమె మామగారి కంటే ముందు మరణించాడా, లేదా తర్వాతా అనేదానితో ఇందుకు నిమిత్తం లేదని కోర్టు స్పష్టం చేసింది. ‘‘చట్టప్రకారం ఇంట్లోని డిపెండెంట్స్ అందరి పోషణ బాధ్యతా మరణించిన వారి వారసులపై ఉంటుంది.
మృతుని నుంచి సంక్రమించిన ఆస్తుల నుంచే వారిని పోషించాల్సి ఉంటుంది. హిందూ దత్తత, పోషణ చట్టం (హెచ్ఏఎంఏ)–1956లోని సెక్షన్ 21 (7) ప్రకారం మృతుని వితంతు కోడలు డిపెండెంటే అవుతుంది. ఆ ప్రకారం 22వ సెక్షన్ కింద ఆమె మెయింటెనెన్స్కు హక్కుదారే అవుతారు’’అని తీర్పు రాసిన జస్టిస్ మిత్తల్ స్పష్టం చేశారు. ‘‘కుమారుడు మరణిస్తే కోడలి పోషణ మామగారి ధారి్మక విధి. స్వయంగా లేదా మరణించిన భర్త వదిలి వెళ్లిన ఆస్తి ద్వారా ఆమె తన పోషణ బాధ్యతలు చేసుకోలేనప్పుడు ఇది మరింతగా వర్తిస్తుంది’’అని పేర్కొన్నారు.
మహేంద్రప్రసాద్ అనే వ్యక్తి 2021 డిసెంబర్లో మరణించాడు. తర్వాత రెండేళ్లకు ఆయన కుమారుడు రంజిత్ శర్మ మరణించగా మామగారి ఆస్తి నుంచి మెయింటెనెన్స్ కోరుతూ ఆయన భార్య గీత ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. మామ మరణించినప్పుడు గీత వితంతువు కాదంటూ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో అత్తింటివారు దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు వెలువర్చింది.


