అవి అస్పష్ట, గంపగుత్త ఆరోపణలు | HC scraps domestic violence charges against mother and son | Sakshi
Sakshi News home page

అవి అస్పష్ట, గంపగుత్త ఆరోపణలు

Jun 30 2025 1:55 PM | Updated on Jun 30 2025 1:55 PM

HC scraps domestic violence charges against mother and son

నాగ్‌పూర్‌: క్యాన్సర్‌ నుంచి కోలుకుని భర్త వద్దకు వెళ్లిన తన సోదరిని అత్తింటి వారు కట్నం తేవాలంటూ వెనక్కి పంపించి వేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ప్రతీకారేచ్ఛతోనే ఈ ఫిర్యాదు చేసినట్టుగా భావిస్తున్నామని పేర్కొంది. తనతోపాటు 68 ఏళ్ల తన తల్లిపై నమోదైన కట్నం వేధింపుల కేసును కొట్టివేయాలంటూ పుణేకు చెందిన పిటిషనర్‌ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అనిల్‌ కిలోర్, జస్టిస్‌ ప్రవీణ్‌ ఎస్‌ పాటిల్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు 2016లో వివాహమవగా అతడి భార్యకు క్యాన్సర్‌ ఉన్నట్లు 2019లో నిర్థారణయింది.

అనంతరం ఆమె తన సోదరుడి వద్ద ఉంటూ చికిత్స తీసుకుంది. వైద్యం ఖర్చు కొంత సోదరుడే భరించాడు. వ్యాధి నుంచి కోలుకున్నాక 2020 జనవరిలో ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లింది. అయితే, రూ.8 లక్షల కట్నం తేవాలంటూ ఆమెను భర్త, అత్త వెనక్కి పంపించి వేశారంటూ సోదరుడు 2021 ఫిబ్రవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మరునాడు, అంటే ఫిబ్రవరి 12వ తేదీన ఆమె కన్నుమూసింది. అత్తింటి వారి నుంచి క్యాన్సర్‌ చికిత్సకు అయిన ఖర్చులను రాబట్టేందుకే అతడు కేసు వేశాడని పిటిషనర్‌ తరఫు లాయర్‌ యోగేశ్‌ వైద్య వాదించారు. 

పిటిషనర్‌ తన భార్య వైద్యానికైన ఖర్చు కొంత భరించారని, వైద్య బీమా కూడా చేయించారని ధర్మాసనానికి ఆధారాలను నివేదించారు. పైపెచ్చు, పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయలేదు, ఇతరత్రా వేధింపులేవీ నమోదు కాలేదన్నారు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత భర్త వద్దకు ఆమె ఎప్పుడు వెళ్లింది వంటి వివరాలు సైతం లేవన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ భార్య సోదరుడు కక్ష సాధింపు కోసమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అస్పష్టంగా, ఎలాంటి ఆధారాల్లేకుండా గంపగుత్తగా అతడీ ఆరోపణలు చేశాడని తెలిపింది. పిటిషనర్, అతడి తల్లిపై నమోదైన కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement