‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు ’ఈ ఫ్యామస్ డైలాగ్ గుర్తుందా? కానీ ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలుస్తే అవాక్కవ్వాల్సిందే. ఒక సామాన్య రైతు భార్య బ్యాంకు ఖాతాలోకి ఉన్నట్టుండి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అయితే డబ్బెవరికి చేదు అని ఆమె అనుకోలా. ఆమె చేసిన పని ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది.
స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మైనపురి జిల్లాకు చెందిన ఒక రైతు భార్య రీటా. రాష్ట్రంలోని దేవగంజ్ గ్రామంలో తన భర్త పరాస్భన్ బహేలియాతో కలిసి నివసిస్తోంది. ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సమయంలో, ఆమె కొంత నగదు విత్డ్రా చేయడానికి స్థానిక బ్యాంకుకు వెళ్లింది. అయితే, 'మహా అష్టమి' పర్వదినం కారణంగా బ్యాంకు మూసివేసి ఉండటంతో ఆమె నగదు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత, నగదు విత్డ్రా చేయడానికి ఆమె సమీపంలోని ఏటీఎం (ATM) కేంద్రానికి వెళ్లింది. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.10 కోట్లు(రూ. 9,99,49,588) జమ అయినట్లు గుర్తించి, రీటా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆ విషయాన్ని నమ్మలేక, ఖాతాలో ఉన్న మొత్తాన్ని సరిచూసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఆమె మరో ఏటీఎంకు వెళ్లింది. అక్కడ కూడా అదే మొత్తం కనిపించింది. ఆమె ఈ విషయాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, అది కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్
ప్రశంసలందుకుంటున్న ఆమె నిర్ణయం
పొరపాటున తన 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాలో జమ చేసిన రూ. 10 కోట్లను చూసి అత్యాశకు పోలేదు. రీటా ఆ డబ్బును విత్డ్రా చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా, ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆ డబ్బును ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొరుగువారితో పాటు ఇతరులు కూడా ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. రీటా నిజాయితీని చాలామంది సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.
బ్యాంక్ అధికారుల ప్రశంసలు
ఆమె నిజాయితీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే స్పందించారు. టెక్నికల్ ఎర్రర్, లేదా పొరబాటున ఇలా జరిగి ఉంటుందని, విచారణ జరిపి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని హామీ పాండే తెలిపారు.
సోషల్ మీడియా ఫిదా
'ఈ డబ్బు నాది కాదు, దీన్ని వెనక్కి తీసుకోండి' అని ఆమె బ్యాంకు అధికారులతో స్పష్టం చేసింది. దీంతో తన బ్యాంక్ అకౌంట్లో పొరపాటున పది కోట్ల రూపాయలు పడినా, ఆశపడకుండా నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలందుకుంటోంది. సాధారణ ప్రజలలో అత్యధికులు నిజాయితీపరులేనని, అందుకే మానవజాతి మనుగడ సాగిస్తోంది అంటూ ఎక్స్ యూజర్ శేఖర్ వెంబు వ్యాఖ్యానించారు.


