
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు ఉల్లంఘన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రధాన రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడం బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే లభించాయి. 2017-18 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిని ప్రవేశ పెట్టారు. ఈ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే.. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి. కాగా ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. 2016 నుంచి 2022 మధ్య రూ. 16,437. కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లు ఎస్బీఐ విక్రయించింది. మొత్తం విరాళాల్లో బీజేపీకి 60 శాతం పైగా రూ. 10,122 కోట్లు సమకూరాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో 10 శాతం రూ. 1547 కోట్ల విరాళాలను స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ 8 శాతంతో రూ. 823 కోట్ల విరాళాలను స్వీకరించింది. ఈ జాబితాలో 30 పార్టీలకు అందిన విరాళాలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇంకా ఈ జాబితాను పరిశీలిస్తే సీపీఎం రూ. 367 కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు, బీఎస్పీ రూ. 85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించాయి. 2017 నుంచి 2022 వరకు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీఐదు రెట్లు ఎక్కువ విరాళాలను పొందింది.
చదవండి: లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు.. మోదీ సర్కార్పై రాహుల్ ఫైర్