‘న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు’ | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పోలీసులపై చిదంబరం ఫైర్‌

Published Sun, Sep 13 2020 5:15 PM

Chidambarams Jibe On Chargesheet Row - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చెలరేగిన అల్లర్ల (సీఏఏ)కు సంబంధించి అనుబంధ చార్జిషీట్‌లో సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, స్వరాజ్‌ అభియాన్‌కు చెందిన యోగేంద్ర యాదవ్‌, ఇతర మేథావుల పేర్లను వెల్లడించిన ఢిల్లీ పోలీసులు నేర న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం అన్నారు. సమాచారం, చార్జిషీట్‌ మధ్య విచారణ, ధృవీకరణ వంటి కీలక దశలుంటాయని ఢిల్లీ పోలీసులు మర్చిపోయారా అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆదివారం ట్వీట్‌ చేశారు. చదవండి : ‘దేవుని చర్య’.. ఆగని విమర్శలు

ఇంకా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన డిస్‌క్లోజర్‌ స్టేట్‌మెంట్‌లో ఆర్థిక వేత్త జయతి ఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌ రాహుల్‌ రాయ్‌ల పేర్లున్నాయి. కాగా వీరిని తాము నిందితులుగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇక పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు అనుబంధ చార్జిషీట్‌ దాఖలు కావడంతో దీనిపై రాజకీయ దుమారం రేగింది. తమ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రస్తావిస్తుందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి.

Advertisement
Advertisement