మళ్లీ కలకలం.. నీట్ ప్రశ్నపత్రం ఉందంటూ రూ.30 వేల డిమాండ్ | Caller Demands Rs 30000 For Alleged NEET Paper Cops Probe Claim | Sakshi
Sakshi News home page

మళ్లీ కలకలం.. నీట్ ప్రశ్నపత్రం ఉందంటూ రూ.30 వేల డిమాండ్

Jun 21 2026 5:03 PM | Updated on Jun 21 2026 9:12 PM

Caller Demands Rs 30000 For Alleged NEET Paper Cops Probe Claim

అజ్మీర్‌: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్-యూజీ రీ ఎగ్జామ్‌ రాస్తున్న వేళ ఓ వార్త ఆదివారం బయటకు వచ్చి కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. తన వద్ద నీట్ ప్రశ్నపత్రం ఉందని చెబుతూ, దాన్ని ఇవ్వాలంటే రూ. 30,000 చెల్లించాలని కొందరు విద్యార్థులను డిమాండ్ చేశాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. డీఏవీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కృష్ణ సింగ్ ఠాకూర్ ఈ విషయం గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీడియో కాల్‌లో దుండగుడు ప్రశ్నపత్రం చూపిస్తూ విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడని ఠాకూర్‌ ఆరోపించారు. ఈ విషయం కళాశాలలో కొత్తగా చేరిన ఓ విద్యార్థిని తనకు చెప్పిందని, ఆమె చెప్పిన నంబర్‌కు తానే ఫోన్ చేసి నిజానిజాలు తెలుసుకున్నానని ఠాకూర్ తెలిపారు.

"రేపు నీట్ పరీక్ష ఉంది. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారు. నాకు ప్రశ్నాపత్రం చూపించి రూ. 30,000 చెల్లించాలని చెప్పారు. ఆ సంభాషణ రికార్డింగ్‌ను పోలీసులకు ఇచ్చాను" అని ఆయన తెలిపారు. డబ్బు పంపాలని క్యూ ఆర్ కోడ్ కూడా పంపారని ఆరోపించారు.

ఇప్పటికే పలువురు విద్యార్థులు ఈ మోసానికి గురయ్యారని ఠాకూర్ తెలిపారు. ఇలాంటి మోసగాళ్లను నమ్మకుండా పరీక్ష ప్రిపరేషన్‌పైనే దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ హిమాన్షు జంగిడ్‌ను కలిసి ఈ ఘటన వివరాలు చెప్పానని, క్యూ ఆర్ కోడ్, కాల్ చేసిన నంబర్ సహా డిజిటల్ ఆధారాలు అందజేశానని వెల్లడించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మొబైల్ నంబర్ ఉన్న ప్రదేశం, క్యూ ఆర్ కోడ్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో కాల్‌లో చూపించిన ప్రశ్నపత్రం నిజమైనదేనా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అజ్మీర్ పోలీసు సూపరింటెండెంట్ ఉషా యాదవ్ పరీక్ష రాసే అభ్యర్థులు మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు.

"వీడియో కాల్ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రాలు అమ్ముతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల సమయంలో సైబర్ మోసగాళ్లు చురుకుగా మారి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటారు" అని ఆమె చెప్పారు. ఇది పెద్ద స్థాయి ప్రశ్నాపత్రం లీక్ ముఠాలో భాగమా, లేక విద్యార్థులను మోసం చేసే కొత్త పద్ధతా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

మే 3న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో రీఎగ్జామ్‌ నిర్వహించారు. ఆదివారం దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు నీట్-యూజీ మళ్లీ రాస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement