భోపాల్‌లో 'బ్లడ్ కిక్' కలకలం | Blood Kick Horror In Bhopal Madhya Pradesh | Sakshi
Sakshi News home page

భోపాల్‌లో 'బ్లడ్ కిక్' కలకలం

Apr 14 2026 3:16 PM | Updated on Apr 14 2026 4:06 PM

Blood Kick Horror In Bhopal Madhya Pradesh

భోపాల్: భోపాల్‌లో 'బ్లడ్ కిక్' కలకలం రేపుతోంది. నగరంలో ఒక భయంకరమైన కొత్త వ్యసనానికి అలవాటు పడుతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధం లేదు.. కానీ అంతే వేగంగా ప్రాణాలను తీసే కొత్త వ్యసనం వెలుగులోకి వచ్చింది. దీనిని "బ్లడ్ కిక్" అని పిలుస్తున్నారు. యువకులు తమ సొంత రక్తాన్ని తీసి, తిరిగి తమ శరీరంలోకే ఎక్కించుకునే (ఇంజెక్ట్) ఈ వింత ధోరణి ఆందోళన కలిగిస్తోంది.

విదేశాల్లో మొదలైన ఈ వికృత ధోరణి ఇప్పుడు నిశ్శబ్దంగా మధ్యప్రదేశ్ రాజధానిలోకి ప్రవేశించింది. ఇది వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఏడాది(2026) జనవరి నుంచి గాంధీ మెడికల్ కాలేజీలో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులందరూ 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గలవారే. తల్లిదండ్రులు వారి ప్రవర్తనలో మార్పును గమనించి.. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు తీవ్ర ఆగ్రహంతో గొడవలకు దిగుతున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు వారిని సైకియాట్రీ విభాగానికి తీసుకువస్తున్నారు.

మాదక ద్రవ్యాలు తీసుకోరు. వీరిలో మద్యం వాసన  కానీ.. డ్రగ్స్ ఆనవాళ్లు గానీ కనిపించవు. బదులుగా, శరీరంపై ఇంజెక్షన్లు తీసుకున్న గుర్తులు ఉంటాయి. ఇలాంటి  వింత పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని హమీడియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తమ రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల తక్షణ శక్తి, ప్రశాంతత, నియంత్రణ లభిస్తుందని  వ్యసనానికి అలవాటుపడిన యువకులు నమ్ముతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement