‘ఆప్‌’ జాతీయ కన్వీనర్‌గా మూడోసారి కేజ్రీవాల్‌

Arvind Kejriwal Re-Elected As Aam Aadmi Party National Convenor - Sakshi

కార్యదర్శిగా పంకజ్‌ గుప్తా..

కోశాధికారిగా ఎన్‌.డి.గుప్తా

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)జాతీయ కన్వీనర్‌గా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహక సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు. కేజ్రీవాల్‌ను జాతీయ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ‘ఆప్‌’ జాతీయ కార్యదర్శిగా పంకజ్‌ గుప్తా, జాతీయ కోశాధికారిగా ఎన్‌.డి.గుప్తా ఎన్నికయ్యారు. ఇక ఐదేళ్ల పదవీ కాలానికి ఆఫీస్‌ బేరర్లను కూడా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్‌తో సహా 34 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ బాడీని ఏర్పాటు చేశారు.

పార్టీ జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌ పేరును ఎగ్జిక్యూటివ్‌ బాడీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల అమలు కోసం కేజ్రీవాల్‌ అలుపెరుగని కృషి సాగిస్తున్నారని, జాతీయ కన్వీనర్‌గా ఆయనను వరుసగా మూడోసారి ఎన్నుకోవడం సముచితమైన నిర్ణయమని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో మరోసారి నిర్వహించనున్న జాతీయ కార్యనిర్వాహక భేటీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top