న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. వాషింగ్టన్ డీసీలోని ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న వేదిక వద్దకు తుపాకులు, కత్తులతో ఒక దుండగుడు చొరబడటం కలకలం రేపింది. ఈ భయానక ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని వ్యాఖ్యానించారు.
తుపాకులు, కత్తులతో చొరబాటు
శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అత్యంత పటిష్ట భద్రత నడుమ ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాలు, కత్తులు ధరించిన ఒక వ్యక్తి అనూహ్యంగా ఈవెంట్ జరుగుతున్న బాల్రూమ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. భూగర్భంలో ఉన్న ఆ బాల్రూమ్ వెలుపల కాల్పుల శబ్దాలు వినిపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణభయంతో అతిథులు టేబుళ్ల కిందకు దూరి తలదాచుకున్నారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేగంగా స్పందించి, దుండగుడిని అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రధాని మోదీ సంఘీభావం
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా స్పందించారు. ట్రంప్ దంపతులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని.. హింస అనేది ఏ రూపంలో ఉన్నా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఇలాంటి దాడులకు ఏమాత్రం స్థానం లేదని ప్రధాని పేర్కొన్నారు.
Relieved to learn that President Trump, the First Lady and Vice President are safe and unharmed following the recent security incident at a Washington DC hotel. I extend my best wishes for their continued safety and well-being. Violence has no place in a democracy and must be…
— Narendra Modi (@narendramodi) April 26, 2026


