
యోగాతో మానసిక ప్రశాంతత
నారాయణపేట రూరల్: ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగ జీవితంలో భాగంగా మార్చుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని సేవా భారతి ప్రతినిథి డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో బుధవారం యోగా క్లబ్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని కరపత్రం విడదల చేసి మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. నిత్యజీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని వాటన్నింటినీ అధిగమించి ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 7గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా, ఈనెల 21న స్థానిక అభినందన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు సామూహిక యోగా దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19న పాఠశాల, కళాశాల విద్యార్థులకు నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో సురేష్, రాజేంద్ర లాహోటి, ల్యాబ్ శివకుమార్, క్యాతన్ రఘు, నరసింహులు, బాలకృష్ణ, రజిత, జ్యోతి, రాణి, శిరీష, ఉమాదేవి, మల్లికార్జున్, శ్రీనివాస్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.