
‘ఉపాధి’ పనుల్లో వేగం పెంచాలి
నారాయణపేట: జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ఉపాధి హామీ పనులు, ఇందిరా మహిళ శక్తి భవన నిర్మాణం, ఇందిర్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా తదితర పనులపై అధికారులతో సమీక్షించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం వంద శాతం మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పాఠశాల ఆవరణలో బ్లీచింగ్ పౌడర్ను చల్లించి పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎంపీడీవోలు నిరంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయాలని, వంటకు పామాయిల్ వినియోగించకుండా చూడాలని, గ్యాస్ కనెక్షన్ ద్వారానే మధ్యాహ్న భోజనం పండేలా ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించాలన్నారు. జెడ్పీ సీఈవో శైలేష్ కుమార్, డీఎసీప లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీడీవోలు, ఏపీఓలు పాల్గొన్నారు.
కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగవంతం
సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సింగారం వద్ద నిర్మిస్తున్న ఐడీఓసి (సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ)పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. వివిధ గదులు, వాటిలో కొనసాగుతున్న పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని అధికారులతో ఆరా తీశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.