ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం

Jun 19 2025 4:00 AM | Updated on Jun 19 2025 4:00 AM

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం

నారాయణపేట రూరల్‌: అభివృద్ధి చెందిన దేశాల మాదిరి పాఠశాల స్థాయి విద్య ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని.. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు కంకణబద్ధులు కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌ రెడ్డి అన్నారు. నారాయణపేటలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్‌ విద్యార్థుల అభినందన సభకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తోపాటు ఆయన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యవస్థను తొలగించి ప్రాథమిక విద్యకు కేవలం ప్రభుత్వ పాఠశాలను కొనసాగిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. చిన్నతనంలోనే ఒత్తిడితో కూడిన విద్యను అభ్యసించడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగలేక పోతున్నారని, సర్కారు బడిలో స్వేచ్ఛాయుతమైనటువంటి విద్యాభ్యాసం జరుగుతుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉందని, ఆయన విశేష కృషితో విద్యారంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ అధికారుల పోస్టులైన డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పోస్టులను అవసరమైన చోట మంజూరు చేసి ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందన్నారు.

విద్యార్థుల సంఖ్య పెంచాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గతంలో కంటే సర్కారు బడుల్లో 20శాతం చేరిక తగ్గిందని, రాబోయే రోజుల్లో సంఖ్య మరింత మెరుగుపడే విధంగా విద్యాశాఖ చర్యలు చేపట్టాలన్నారు. టెన్త్‌ లో చక్కటి ఫలితాలకు జిల్లాలో ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను సిద్ధం చేశారని, వేక్‌ అప్‌ కాల్‌, ఇంటికి తలుపు తట్టు కార్యక్రమాలతోపాటు రివిజన్‌ టెస్టులునిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచారన్నారు. అనంతరం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుండు లక్ష్మణ్‌, పుల్గం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియతో పాటు పండిత్‌ పీఈటీల అప్‌గ్రేడ్‌ సమస్యను పీఆర్టీయూ పరిష్కరించిందని, 317 బాధితులకు విడతల వారీగా న్యాయం చేస్తామన్నారు. టీచర్ల హక్కులతో పాటు విద్యారంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సంఘం భుజాన వేసుకుని నడిపిస్తుందన్నారు. అనంతరం టాపర్లుగా నిలిచిన 200మంది విద్యార్థులతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో అభినందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు యాద్గీర్‌ జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి వెంకటరెడ్డి, యాదగిరి, డీఈఓ గోవిందరాజు, డీఎస్‌ఓ భాను ప్రకాష్‌, గ్రంథాలయ చైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, వకీల్‌ సంతోష్‌ కుమార్‌, భీష్మరాజ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రాజ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement