నిలువు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

నిలువు దోపిడీ

Jun 19 2025 4:00 AM | Updated on Jun 19 2025 4:00 AM

నిలువు దోపిడీ

నిలువు దోపిడీ

ప్రైవేటు పాఠశాలల్లో తడిసి మోపెడవుతున్న ఫీజులు

ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ పేరుతో అదనపు వసూళ్లు

బడుల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్‌ విక్రయాలు

చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/అచ్చంపేట: తమ పిల్లలను ఉన్నతంగా ప్రైవేటు బడుల్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ కొన్ని ప్రైవేటు పాఠశాలలకు కాసుల పంట పండిస్తోంది. విద్యాశాఖ అధికారుల వైఫల్యం, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఎల్‌కేజీ విద్యార్థికి సైతం రూ.వేలల్లో వసూలు చేసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్ల పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. బస్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెట్టు అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

పోటీ పడి మరీ..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,350 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. 1.90 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరం పలు కొత్త ప్రైవేటు స్కూల్స్‌ ఏర్పాటు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఫీజులు పెద్దఎత్తున పెరిగిపోయాయి. అడ్మిషన్‌ ఫీజుతో మొదలుకొని అనేక రకాలుగా దోచుకుంటున్నారు. ఎల్‌కేజీ విద్యార్థికి దాదాపుగా రూ.20 వేలు.. 2, 3 తరగతుల వారికి రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు.. 9, 10 తరగతుల వారికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటికి తోడు ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ కోర్సులంటూ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మరోవైపు పాఠశాలల్లోనే పుస్తకాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొన్ని పాఠశాలలు యూనిఫామ్స్‌ సైతం విక్రయిస్తుండగా.. మరికొన్ని పలు గార్మెంట్‌ సంస్థలతో ఒప్పందం ప్రకారం యూనిఫామ్స్‌ విక్రయాలు సాగిస్తున్నారు.

కనీస సౌకర్యాలు కరువు..

పాఠశాల తరగతి గదుల్లో వెలుతురు, గాలితో పాటు శుభ్రత ఉండాలి. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా పాఠశాలల్లో రేకుల షెడ్లే తరగతి గదులుగా కొనసాగుతున్నాయి. వెలుతురు లేకపోగా.. ఫ్యాన్లు కూడా సక్రమంగా తిరగని పరిస్థితి ఉంది. మెజార్టీ పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు. పిల్లలను ఉదయం 9నుంచి సాయంత్రం వరకు పాఠశాల గదుల్లో యాజమాన్యాలు బంధిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో మానసిక వికాసం తగ్గిపోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

పేరుకే పేరెంట్స్‌ కమిటీలు..

ప్రతి పాఠశాలకు ఒక పేరెంట్స్‌ కమిటీ ఉండాలి. పాఠశాల యాజమాన్యాలు మాత్రం వారికి అనుకూలమైన వారిని పెట్టుకొని పేరెంట్స్‌ కమిటీలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. చాలా పాఠశాలలు ఈ కమిటీలను కూడా వేయడం లేదు.

ఫీ‘జులుం’

సొంత సిలబస్‌ బోధన..

అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన సిలబస్‌ మాత్రమే బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు స్టేట్‌ సిలబస్‌ను పక్కన పెట్టి.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సొంత సిలబస్‌ బోధిస్తున్నారని తెలుస్తోంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి వాటికి ప్రభుత్వం ఇప్పటికీ సిలబస్‌ను సూచించలేదు. కానీ వారికి కూడా ప్రైవేటు పబ్లికేషన్స్‌లో సిలబస్‌ తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రైవేటు కరికులమ్‌కు ఒక్కో విద్యార్థికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ సిలబస్‌ పుస్తకాలను విక్రయిస్తే రూ.500 నుంచి రూ.1000 మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉంటుంది.

ఇవీ నిబంధనలు..

ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఉండాలి.

భవన నిర్మాణ నాణ్యత ధ్రువపత్రం ఉండాలి.

విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, ల్రైబరీ, ప్రహరీ, అగ్నిమాపకశాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్‌ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి.

విద్యా హక్కు చట్టం ప్రకారం బీఎడ్‌, డీఎడ్‌ పూర్తిచేసిన వారు బోధన చేయాలి.

పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యంకల్పించాలి.

పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీస్‌ బోర్డుపై ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయాలి. ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్‌ కోసం అనుమతి తీసుకోవాలి. ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తప్పనిసరి.

తాత్కాలిక బుక్‌ సెంటర్లు ఏర్పాటు..

కొంత మంది వివిధ బుక్‌ సెంటర్లలో పుస్తకాలను పెట్టి అమ్ముతుండగా.. మరికొంత మంది బయట తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు ప్రైవేటు పబ్లికేషన్స్‌కు సంబంధించిన మెటీరియల్స్‌ సరఫరా చేసేందుకు మహబూబ్‌నగర్‌లోని షాషాబ్‌గుట్ట సమీపంలో గోదాం ఏర్పాటు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement