
‘పేట’ అభివృద్ధి మాటేమిటి..?
నారాయణపేట: ఎన్నికల ముందు నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు రెండు కళ్లలాంటివని, ఇప్పుడేమో నిధులన్నీ కొడంగల్కు తరలిస్తున్నారని, నారాయణపేట అభివృద్ధి మాటేమిటని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల రెండో సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నా భవనం నిర్మాణం ప్రారంభించలేదని, కలెక్టరేట్ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయని, ఎస్పీ కార్యాలయానికి పునాదే పడలేదని అన్నారు. మరో వైపు కొడంగల్ నియోజకవర్గ చివరి వరకు డబుల్ రోడ్డు వేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా...లేకున్నా తెలంగాణ ప్రజల బాగోగుల కోసం పోరాటం చేసే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నదని అన్నారు. 25 వసంతలు పూర్తిచేసుకొని ఈ నెల 27న వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవాలకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలనిపిలుపునిచ్చారు. ఈ నెల 27న ప్రతి గ్రామంలో గ్రామ అధ్యక్షులు, మండల కేంద్రాల్లో మండల అధ్యక్షులు, జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించాలన్నారు. అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, కానుకుర్తి వెంకట్రెడ్డి,వేపూరి రాములు, విజయ్సాగర్ పాల్గొన్నారు.