
మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నిషేధం అమలుపై మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేవలం గంజాయి మాత్రమే కాకుండా బీడీ, సిగరెట్, మద్యం లాంటివి విద్యార్థులపై ప్రభావం చూపే ఆస్కారం ఉందని.. కళాశాలల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే జిల్లాలోని 109 జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య వివరించారు. అదే విధంగా గంజాయి సాగు, సరఫరాకు సంబంధించి 2022లో మూడు కేసులు, 2024లో మూడు కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం ట్రయల్ నడుస్తున్నాయన్నారు. ఇకపై జిల్లాలో ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కావడానికి వీలులేకుండా రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిషేధించాలన్నారు. మాదకద్రవ్యాల నిషేధిత జిల్లాగా నారాయణపేటను మార్చాలన్నారు. మళ్లీ నిర్వహించే సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, సైకాలజిస్టు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలోఆర్టీఓ మేఘాగాంధీ, ఎకై ్సజ్ సీఐలు అశోక్ కుమార్, బాలకృష్ణ, ఎస్ఐలు గురవయ్య, ఎల్ఎస్ శిరీష, అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీపీఆర్ఓ ఎంఏ రషీద్, డీఐఈఓ సుదర్శన్, డీఈఓ గోవిందరాజులు, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారిణి అఖిల ప్రసన్న ఉన్నారు.