
ఇసుక మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని మూసాపేట మండలంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ల సంఘం నాయకుడు ఘన్సిరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ, తహసీల్దార్ల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసాపేట తహసీల్దార్ రాజునాయక్, కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్పైన అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా నాయకుడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు జరిగితే విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోని తొలగించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, టీజీఓ జిల్లా కార్యదర్శి వరప్రసాద్, టీజీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, దేవేందర్, చైతన్య, సుదర్శన్రెడ్డి, రవికుమార్, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ భవన్లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కల్పించబడిన చట్టబద్ధ హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక కర్షక ఫాసిస్ట్ విధానాలపై మే రెండో వారంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.