కొత్తపల్లి: విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలని.. ఒత్తిడిని అధిగమిస్తేనే పరీక్షల్లో విజయం సాధించవచ్చునని.. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పదో తరగతి విద్యార్థుల గతేడాది ఫలితాలను హెచ్ఎంను అడిగి తెలుసుకొని.. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని, ఈమేరకు విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో తీర్చిదిద్దాలని సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మరికొద్ది రోజుల్లో జరగనున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం అల్పాహరం సరైన సమయానికి అందుతుందా లేదా, నాణ్యత ఎలా ఉంది అంటూ విద్యార్థులను ఆరా తీశారు. నాణ్యత లేకుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థుల సబ్జెక్ట్ విషయాలపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ఆరా తీస్తూ.. విద్యార్థులతో ముఖాముఖి ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టారు. ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు. ఆవరణలోని బయో పార్క్లో నాటిన మొక్కలు, వాటి పరిరక్షణ గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులు మమేకమై పూర్తి స్థాయిలో పార్కును సంసిద్దం చేయాలని, అందుకు తగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈక్రమంలో పాఠశాలకు బోరు వేయించాలని ఉపాధ్యాయులు కలెక్టర్ను కోరగా.. ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శిని తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణారావ్, తహసీల్దార్ జయరాములు, శ్రావణ్, గ్రామ కార్యదర్షి వెంకటేష్, హెచ్ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.