● ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట: జిల్లాలోని ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో.. సంప్రదాయ పద్ధతులు, సహజ సిద్దమైన రంగులతో జరుపుకోవాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. హోళీ పండుగ సందర్భంగా జిల్లాలోని సీఐలతో ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. హోళీకి సంబంధించి రోడ్డు ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన భద్రతాపరమైన సూచనలు చేశారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చట్టరీత్య నేరమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, బాటసారులు, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడడని, గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని అక్కడ అవసరమైతే బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, రష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, లాంటివి యువత మానుకోవాలని సూచించారు. ప్రధాన చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన ప్రదేశాలలో ప్రాంతాలలో, ప్రధాన చౌరస్తాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు
జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల ఎక్కువగా జరిగే ప్రదేశాలను హాట్ స్పాట్లుగా గుర్తించి ఆయా చోట్ల సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్, బారికేట్స్ ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిఐలు శివశంకర్, రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు ఎస్బిఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.