పాతాళగంగ వద్ద అప్రమత్తంగా ఉండాలి
శ్రీశైలం: పాతాళగంగ వద్ద విధులు నిర్వహించే పోలీసులు, అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. పాతాళంగంగ మెట్ల మార్గంలో స్నానఘట్టాల వద్దకు చేరుకొని అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి నుంచే పాతాళగంగలో పుణ్యస్నాలాచరించుకోవడానికి వేల సంఖ్యలో శివస్వాములు భక్తులు మెట్ల మార్గం ద్వారా వస్తారని తెలిపారు. విడతల వారీగా భక్తులను స్నానఘట్టాల వద్దకు పంపించాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మైకుల ద్వారా సూచనలు జారీ చేయాలని సూచించారు. పాతాళగంగలో బోట్ విహారానికి వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు.
డ్రోన్ కెమెరాలతో నిఘా
భక్తుల భద్రతపై నిఘానేత్రలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు 84,000 మంది స్వామివార్లను దర్శించుకున్నారని, వీరిలో 32,543 మంది శివ స్వాములు ఉన్నారని చెప్పారు. క్షేత్ర వ్యాప్తంగా భక్తుల భద్రత దష్టిలో ఉంచుకొని డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు.


