అహోబిలేశుడికి బ్రహ్మరథం
ఆళ్లగడ్డ: పార్వేటగా బయలుదేరిన అహోబిలేశుడికి ఊరూరా భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఊరి పొలిమేరకు చేరుకోగానే ఎదురెళ్లి ఘన స్వాగతం పలుకుతున్నారు. నాలుగు రోజులుగా ఆళ్లగడ్డ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి పార్వేట మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. పట్టణంలోని తెలుపులపై కొలువైన ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తూ మొక్కుబడులు చెల్లించుకున్నారు. చివరి రోజు మంగళవారం ఉదయం పొలిమేర తెలుపుపై కొలువైన ఉత్సవ పల్లకీని సంప్రదాయ ప్రకారం అధికారులు, గ్రామ పెద్దలు వీడ్కోలు పూజలు నిర్వహించి పల్లకీని సాగనంపారు. పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ పల్లకీ మంగళవారం రూరల్ మండలం ఎస్ లింగందిన్నెకు చేరుకుంది. గ్రామ పొలిమేరకు చేరుకున్న పల్లకీకి గ్రామస్తులు స్వాగతం పలికి విశేష పూజలు చేశారు. అనంతరం పల్లకీని భక్తులు తమ భుమాజాలపై మోసుకుంటూ గ్రామంలోకి చేరుకున్నారు. స్వామి రాకతో గ్రామంలో తిరునాల సందడి నెలకొంది.
అహోబిలేశుడికి బ్రహ్మరథం


