మాతృ మరణాల సంఖ్య తగ్గుముఖం
చాగలమర్రి: వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తుండటంతో రాష్ట్రంలో మాతృమరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఏపీ ఎంసీహెచ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన చాగలమర్రి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పీహెచ్సీలో నిర్వహిస్తున్న ఓపి, ఐపి, ఫార్మసీలను పరిశీలించారు. అనంతరం ఆయన వైద్యాధికారిణి అంజలి, సిబ్బందితో పీఎంఎస్ఎంఏ, పీఎంజెఏవై, ఎంసీహెచ్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఆయన వెంట తనిఖీలో ఆరోగ్య విస్తరణాధికారి వెంకటేశ్వర్లు, ఫార్మసిస్ట్ రాజేష్, స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, ఎల్టీ శ్రీనివాసనాయక్, హెల్త్ అసిస్టెంట్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
నంద్యాల(అర్బన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వైవీకే షన్ముఖ కుమార్ తెలిపారు. స్థానిక ప్రథమనంది కల్యాణ మండపంలో మండల, డివిజన్, జిల్లా స్థాయి ఎంపీడీఓలు, పీఆర్, ఎన్ఆర్ఈజీఎస్ జిల్లా స్థాయి అధికారులు, ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ పీడీ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ షన్ముఖ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న క్యాటిల్ షెడ్, హార్టికల్చర్, వివిధ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం మార్చి తర్వాత వీవీజీ ఆర్ఏఎంజీలోకి మార్పు చెందుతుందని, ఫిబ్ర వరి 28లోగా పనులు పూర్తి చేయాలన్నారు.
ఆర్యూలో విద్యార్థుల మధ్య గొడవ
కర్నూలు (సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. పీజీ విద్యార్థిపై బీటెక్ విద్యార్థులు దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఏడాదిలో విద్యార్థుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం ఇది నాలుగో సారి. మంగళవా రం రాత్రి 8 గంటల సమయంలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ఓబులేసు అనే విద్యార్థిపై మూడో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థులు దాడి చేశారు. ముఖంపై కొట్టడంతో నోటి వెంబడి రక్తం వచ్చింది. దీంతో సమీపంలో ఉన్న విద్యార్థులు కొందరు కలగజేసుకుని దాడిని సద్దుమణిగించారు. అయితే, దాడిచేసిన బీటెక్ విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. వర్సిటీలో తరచూ విద్యార్థులు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై విచారణ చేయిస్తామని వైస్ చాన్స్లర్ వి.వెంకటబసవరావు తెలిపారు.
వాము వ్యాపారుల సిండికేట్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారుల సిండికేట్ కొనసాగుతోంది. మార్కెట్లో వాముకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సిండికేట్ కారణంగా ధరలు పెరుగకపోగా తగ్గుతుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం మార్కెట్కు వాము 994 క్వింటా ళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,011, గరిష్ట ధర రూ.26,800 లభించగా..సగటు ధర రూ.12,6 99 మాత్రమే నమోదైంది. ఈ నెల 2న వాముకు లభించిన గరిష్ట ధర రూ.30,303 ఉండగా.. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. మార్కెట్కు వాము భారీగా వచ్చేలా ఒకటి, రెండు చిన్న లాట్లకు ఎక్కువ ధర కోట్ చేయడం పరిపాటిగా మారింది.
ఎంపీపీ వెంకటేశ్వరమ్మ
కర్నూలు (సిటీ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల పీఠాలను దక్కించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కర్నూలు రూరల్ ఎంపీపీగా డి.వెంకటేశ్వరమ్మను యథావిధిగా కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ మండలాల ఎంపీపీ, మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఖాళీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కర్నూలు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలి యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని మండలాధికారులు జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. దీంతో కర్నూలు రూరల్ ఎంపీపీ ఎన్నిక కోసం ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపివేస్తూ ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.


