
పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ పూర్తయినందున సంఘాల లావాదేవీలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించే అవకాశం ఏర్పడిందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ పి.రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని 56 పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పూర్తయిన నేపధ్యంలో సంఘాల సీఈఓలకు కర్నూలులో నిర్వహించిన వర్క్షాపులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది మార్చి 31 ఆడిట్ పైనల్ రిపోర్టులను, 2025 సంవత్సరానికి సంబంధించి ఇయర్ ఎండ్ ప్రాసెస్ మాడ్యుల్స్పై అవగాహన కల్పించారు. టెక్నికల్ సపోర్టు గురించి వివరించారు. ఎన్ఎల్పీఎస్వీ టెక్నికల్ సపోర్టర్ భువనేశ్వర్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు, ఆప్కాబ్ డీపీడీఎం నహిదా సుల్తాన, డీజీఎంలు సునీల్కుమార్, నాగిరెడ్డి, డిపార్టుమెంటల్ ఆడిటర్స్, సంఘాల సీఈఓలు పాల్గొన్నారు.
పీఏసీఎస్ల పర్సన్ ఇన్చార్జ్ల పదవీ కాలం పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 79 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్జ్ల పదవీ కాలన్ని ఈ ఏడాది జూలై 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 32, నంద్యాల జిల్లాలో 47 పీఏసీఎస్ల పర్సన్ ఇన్చార్జ్లుగా సహకార శాఖ అధికారులు పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 30 వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తూ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐటీఐలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వచ్చే నెల 15వ తేదీలోపు www.iti.ap.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల 17వ తేదీన జరుగనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు జూలై 21, 22, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు 23 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
హోంగార్డుపై ఏఎస్ఐ దాడి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణ విషయంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హోంగార్డు బాషా మధ్య గురువారం రాత్రి వివాదం చోటు చేసుకుంది. పైఅధికారిగా ఉన్న తన మాటలను హోంగార్డు బాషా లెక్క చేయడం లేదని ఏఎస్ఐ దాడికి పాల్పడ్డాడు. ముఖం మీద కొట్టడంతో హోంగార్డు బాషా పళ్లు రాలినట్లు తెలుస్తోంది. ఘటనపై హోంగార్డు బాషా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి ఏఎస్ఐ వెంకటేశ్వర్లుపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.