దళారుల పంట పండుతోంది! | loss to ap farmers: Andhra pradesh | Sakshi
Sakshi News home page

దళారుల పంట పండుతోంది!

Jun 21 2025 6:16 AM | Updated on Jun 21 2025 6:16 AM

loss to ap farmers: Andhra pradesh

అరటి కాయలను ఎగుమతి చేసేందుకు సిద్ధం చేస్తున్న కూలీలు

రైతుల కష్టం దర్జాగా దోపిడీ

వ్యాపారుల మాటున మోసం చేస్తున్న వైనం

సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్న దళారీ వ్యవస్థ

బొప్పాయి, అరటి రైతులకు తీవ్ర నష్టం

దళారీ వ్యవస్థ.. ఉద్యాన పంటల మార్కెట్‌ను శాసిస్తోంది. వారు చెప్పిందే ధర. మార్కెట్‌ను తమ కనుసన్నల్లోనే నడుపుతున్నారు. గతంలో దళారీ అంటే రైతుకు, వ్యాపారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తూ ఇరువురిని ఒప్పించి పదో పరకో సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం సీను మారిపోయింది. బొప్పాయి, అరటి, మిరప, పసుపు, తమలపాకులు.. ఇలా ఉద్యాన పంట ఏదైనా వారు చెప్పినట్లు రైతులు, వ్యాపారులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కమీషన్‌ మీద ఆధారపడిన వీరు చివరకు వ్యాపారుల మాటున రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.  

ఆళ్లగడ్డ: అన్నదాతల అవసరాన్ని, అమాయకత్వాన్ని దళారులు ఆదాయ మార్గంగా మార్చుకుని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. పంట పండించడం వరకే రైతు హక్కు. మిగతాదంతా దళారుల దయపైనే ఆధారపడి ఉంటోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లాలో ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది. జిల్లా మొత్తం ఎటు చూసినా అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, దానిమ్మ, కర్బూజ, మామిడి, జామ, సపోట, దానిమ్మ,  కలింగర (పుచ్చ).. వంటి పండ్ల తోటలతో పాటు పసుపు, మిరప వంటి ఉద్యాన పంటలు సైతం విపరీతంగా సాగవుతున్నాయి. ఎక్కువగా ఆళ్లగడ్డ, డోన్, నంద్యాల తదితర ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో బొప్పాయి 20 వేల ఎకరాలు, అరటి 40 వేల ఎకరాలు, నిమ్మ 5 వేల ఎకరాల్లో ఉంది. అయితే ఇందులో ఆళ్లగడ్డ ప్రాంతంలోనే అత్యధికంగా అరటి పంట 20,224 ఎకరాలు, బొప్పాయి 10,428 ఎకరాలు, నిమ్మ 3,500 ఎకరాల్లో సాగులో ఉంది. ఈ పంటల   సాగుకు పెట్టుబడి  ఏటేటా రెట్టింపు అవుతోంది. ఉద్యాన పంట ఏదైనా దిగుబడులు విక్రయించే సరికి రైతులకు చివరకు మిగిలేది నష్టం.. దుఃఖమే. దళారులు అన్నదాతల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. మార్కెట్‌లో ధర లేదంటూ కథలు చెబుతూ మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు.

ప్రభుత్వం జిల్లాలో ఎక్కడా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించకపోవడంతో దిగుబడులు బాగున్నా ధర ఆశించిన మేర లభించకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బొప్పాయి టన్ను రూ. 20 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4 నుంచి రూ. 5 వేలకు ధర పడిపోయింది. అరటి టన్ను రూ .26 వేల ధర పలకగా దళారులంతా సిండికేట్‌గా మారి ప్రస్తుతం రూ. 4 వేలకు కొనుగోలు చేస్తున్నారు.    

గద్దల్లా వాలిపోతారు.. 
అరటి, బొప్పాయి పంటలు సాగు చేయాలంటే ఎక రాకు కనీసం రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వర కు పెట్టుబడి అవుతుంది.  అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్లు, ప్రకృతి వైపరిత్యాల నుంచి పంటను బతికించుకున్నా దిగుబడి విక్రయ సమయాని కి దళారులు గద్దల్లా వచ్చి వాలిపోతారు. వ్యాపారు లు అస్సలు గ్రామాల్లో కనిపించక పోయేసరికి దళరులు నిర్ణయించిన మేరకు పంటను విక్రయించాల్సి వస్తోంది.

తమకు ఉపాధి కల్పిస్తూ తమ కుటుంబానికి కడుపునిండా అన్నం పెడుతున్నారన్న జాలి కూడా లేకుండా పుడమి పుత్రులను నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పనిచేసి పంట పండించిన వారికి దళారుల (కమీషను దారులు) కారణంగా పెట్టుబడులు కూడా దక్కని దయనీయ పరిస్థితి నెలకొంటుంది.  

రూ. కోట్లు దళారుల పాలు  
జిల్లాలో వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. అయితే ఏ పంటకు సంబంధించిన దిగుబడిని విక్రయించుకునేందుకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మార్కెటింగ్‌ సౌకర్యం లేదు. అరటి, బొప్పాయిలే 60 వేల ఎకరాల వరకు సాగులో ఉంది. ఎకరాకు 40 టన్నుల దిగుబడి వచ్చిన 24 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంది. టన్నుకు రూ. 2 వేల వరకు కమీషన్‌ అనుకున్నా ఏకంగా రూ. 48 కోట్ల వరకు దళారులు చెమటచుక్క బయటకు రాకుండా దోచుకుంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మోసంపై దృష్టి సారించి స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

వ్యాపారులను రానివ్వకుండా..  
గత పదేళ్ల క్రితం వరకు బొప్పాయి, అరటి సీజన్‌ ప్రారంభమవడానికి ఓ నెల ముందు నుంచే ఈ ప్రాంతం వ్యాపారులతో కళకళలాడేది. ముంబాయి, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన వారితో పాటు నేపాల్, చైనా వంటి ఇతర దేశాలకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు సైతం చాగలమర్రి, ఆళ్లగడ్డ, ఆలమూరు, నంద్యాల ప్రాంతాల్లో నెలల తరబడి మకాం వేసి దళారుల మధ్య వరి్థత్వంతో దిగుబడి కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు దళారులే వ్యాపారుల అవతారమెత్తి అసలు వ్యాపారులను రైతుల వద్దకు వెళ్లనీయకుడా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దళారులంతా సిండికేట్‌గా మారి ధరను నిర్ణయించి రైతులను మోసం చేస్తున్నారు.  

కష్టం రైతులది.. సంపాదన దళారులది 
5 ఎకరాలు బొప్పాయి సాగు చేయాలంటే సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెట్టుబడి వస్తే చాలనీ అనుకుంటాం. కాని దళారులు నెల, రెండు నెలల్లో ఐదెకరాల సరుకుతో కనీసం రూ.3 లక్షలు సంపాదిస్తాడు. వారు అడిగిన ధరకు ఇవ్వాల్సిందే. లేకుంటే తోటలోనే మాగిపోతాయి. అధికారులు చర్యలు తీసుకుని దళారుల దందాను అరికట్టాలి. – రాంగుర్రెడ్డి, రైతు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement