నల్లమలలో వజ్రాల వేట | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో వజ్రాల వేట

Jun 19 2025 3:58 AM | Updated on Jun 19 2025 3:58 AM

నల్లమలలో వజ్రాల వేట

నల్లమలలో వజ్రాల వేట

శిరివెళ్ల: తొలకరి పలకరించడంతో ప్రజలు పొలం బాట పట్టకుండా వజ్రాల వేట కోసం నల్లమల అడవికి వెళ్తున్నారు. నంద్యాల–గిద్దలూరు రహదారి మధ్య గాజులపల్లె సమీప ప్రాంతంలో సర్వ నారసింహస్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా తొలకరి చినుకుల అనంతరం వజ్రాల వేట సాగుతుంది. ఈ ఏడాడి కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడికి వచ్చారు. సర్వ నారసింహస్వామి ఆలయ సమీపంలోని వక్కిలేరు వాగు వెంట గుంతలు తీసి వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఎక్కువగా చెకుముకి రాయి తరహాలో తెల్లగా ఉండే చిన్న చిన్న రాళ్లు దొరుకుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. స్థానికులే కాకుండా ప్రకాశం జిల్లా వాసులు ఇక్కడికి వస్తున్నారు. రోజంతా వెదికి రాత్రికి తెలుగు గంగ కాల్వ వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద నిద్రిస్తున్నారు.

రైతులు చెల్లించిన రుణాలు స్వాహా

నాగంపల్లి సొసైటీ సీఈఓ సస్పెన్షన్‌!

కొత్తపల్లి: రైతులు చెల్లించిన రుణాలు రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు నాగంపల్లి సొసైటీలో పనిచేస్తున్న సీఈఓ కుమ్మరి కోటేశ్వరయ్యపై ఆరోపణలు వచ్చాయి. వసూలు చేసిన రుణాల మొత్తానికి మాన్యువల్‌గా రశీదులు ఇచ్చి ఆన్‌లైన్‌ పేమెంట్‌లో మాత్రం కొంత డబ్బు చెల్లించి తనచేతివాటం చూపించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు మార్చినెల నుంచి అతను విధులకు హాజరు కావడం లేదు. అధికారులు ఫోన్లు చేస్తే స్పందించడం లేదు. దీంతో ఆత్మకూరు పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ మహమ్మద్‌ రసూల్‌.. ఈనెల 10న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు ఈనెల 11న విచారణ చేయగా ఆ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. విచారణ జరుగుతుండగానే సీఈఓ కోటేశ్వరయ్య నుంచి అధికారులు రూ.10 లక్షలు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అతనిపై కొత్తపల్లి, ఆత్మకూరు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మేనేజర్‌ మహమ్మద్‌ రసూల్‌ మాట్లాడుతూ.. నాగంపల్లి సొసైటీ సీఈఓ కొటేశ్వరయ్యపై విచారణ జరుగుతోందన్నారు. అతనని 12న విధుల నుంచి సస్పెండ్‌ చేశామని, పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు.

సచివాలయ ఉద్యోగుల

బదిలీలకు కసరత్తు

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఈ నెల 9తో పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు కసరత్తు ప్రారంభమైంది. ఈ నెల 30లోగా ఈ పక్రియను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు, ఎంపీడీఓలు కార్యాచరణను రూపొందిస్తున్నారు. కాగా కర్నూలు జిల్లాలో 672 గ్రామ/వార్డు సచివాలయాల్లో 4,256 మంది, నంద్యాల జిల్లాలో 516 గ్రామ/వార్డు సచివాలయాల్లో 3,810 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన బదిలీల్లో ఆయా కేటగిరీలకు చెందిన మెజారిటీ ఉద్యోగులు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందిన సమాచారం మేరకు గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులు 194, గ్రేడ్‌–6 కార్యదర్శులు(డిజిటల్‌ అసిస్టెంట్లు ) 371 మంది ఉన్నారు. వీరిలో గ్రేడ్‌ –5 కార్యదర్శులు 153 మంది, గ్రేడ్‌ –6 కార్యదర్శులు 102 మంది గత ఏడాది బదిలీ అయ్యారు. ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిలో గ్రేడ్‌–5 కార్యదర్శులు 27 మంది, గ్రేడ్‌–6 కార్యదర్శులు 206 మంది ఉన్నారు. రేషనలైజేషన్‌లో భాగంగా మండలాల పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను సంబంధిత ఎంపీడీఓలు హెచ్‌ఆర్‌ఎంఎస్‌ లాగిన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే బదిలీలకు అర్హత ఉన్న వారు ఈ నెల 22వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోనున్నారు.

కేజీబీవీల్లో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఆవుట్‌ సోర్సింగ్‌ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు రిక్వెస్ట్‌, మ్యుచువల్‌ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చునని డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్‌ ఎస్‌.శామ్యూల్‌ పాల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement