కన్నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కన్నీటి కష్టాలు

Jun 18 2025 3:11 AM | Updated on Jun 18 2025 3:53 AM

● కౌతాళంలో 15 రోజులకోసారి తాగునీటి సరఫరా ● నిండుకుండలా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ ఉన్నా తీరని దాహం ● చేష్టలుడిగిన అధికారులు

కౌతాళం: మండల కేంద్రంలో 1988 సంవత్సరంలో 6 వేల జనాభా ఉండేది. అప్పట్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ఓహెచ్‌ఆర్‌ ట్యాంకును నిర్మించారు. 10 ఏళ్ల క్రితం కామవరం రస్తాలో 40 వేల లీటర్ల మరో చిన్న ట్యాంకును నిర్మించారు. ప్రస్తుతం మండల కేంద్రం జనాభా 20 లక్షలు. ఇంత జనాభాకు మరో రెండు లక్షల లీటర్ల సామర్థ్యం ట్యాంకులు అవసరం ఉన్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా తాగునీటి సమస్య మండల కేంద్రాన్ని వేధిస్తోంది. 15 రోజులకోసారి కుళాయిలకు నీరు సరఫరా అవుతుండటంతో ఆ రోజు ఒకవైపు పండగను తలపిస్తుండగా.. మరోవైపు నీళ్లు పట్టుకునే సమయంలో అక్కడక్కడా ఘర్షణ సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి.

చెడిపోయిన మోటార్లు

అధికారుల లెక్కల ప్రకారం పదిహేను రోజులకోసారి అంటే రెండు రోజుల క్రితం నీరు కుళాయిలకు సరఫరా కావాల్సి ఉంది. అయితే మోటార్లు చెడిపోవడంతో ఆ రోజు కూడా సరఫరా కాలేదు. దీంతో తాగునీటి సమస్య తీవ్రమైంది. పనులు మానుకుని మండల కేంద్రం వాసులు బిందెలు చేతపట్టుకుని ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ వద్దకు క్యూ కడుతున్నారు. అక్కడ కూడా గంటల తరబడి వేచి ఉంటే తప్ప బిందె నీరు దొరకడం గగనమైంది.

ఏ మారుమూల పల్లెనో కాదు.. ఎడారి ప్రాంతం అంతకన్నా కాదు.. తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్న చోట.. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నిండుకుండను తలపిస్తున్న కౌతాళం మండల కేంద్రంలో.. అదికూడా వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు గొంతు తడవక అల్లాడిపోతున్నారు. పదిహేను రోజులకోసారి సరఫరా అవుతున్న నీటిని ఎంత పొదుపు చేసుకున్నా చాలడం లేదని మండల కేంద్రం వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పనులు మానుకుని ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ వద్దకు వచ్చి బిందె నీటి కోసం గంటల తరబడి వేచి ఉంటున్న ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

నిర్లక్ష్యంతోనే నీటి సమస్య

నీటి సమస్య పరిష్కారానికి 2009లో రాజనగర్‌ వద్ద ఎస్‌ఎస్‌ ట్యాంకును నిర్మించిన అధికారులు.. అక్కడి నుంచి 20 వేల జనాభా ఉన్న కౌతాళంతోపాటు రాజనగర్‌ క్యాంపు, లక్ష్మినగర్‌, బాపురం, వీరాలదిన్నె, డంబలదిన్నె గ్రామాలకు తాగునీరు అందించేందుకు కేవలం 10 హెచ్‌పీ మోటార్‌(ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ వద్ద)ను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక మరమ్మతులకు గురైతే ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరో 10హెచ్‌పీ మోటార్‌ను ఏర్పాటు చేశారు. అయితే చిన్నపాటి ఉరుకుంద, చిరుతపలి కామవరం, ఓబుళపురం గ్రామాలకు తాగునీరు అందించేందుకు 30 హెచ్‌పీ మోటార్‌ను ఏర్పాటు చేసిన అధికారులు 20 వేల జనాభాకు సరఫరా చేసే మోటారుకు 10 హెచ్‌పీ మోటార్‌ ఏర్పాటు చేయడంతో దాని సామర్థ్యం సరిపోవడం లేదు. నిరంతరాయంగా మోటార్‌ పనిచేస్తున్నా.. వారానికోసారి సరఫరా చేసేందుకు సరిపడా నీటిని కూడా పంప్‌ కావడం లేదు. 30 హెచ్‌పీ మోటార్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ఇప్పటి వరకు అతీగతీ లేదు.

నిండుకుండలా ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంక్‌

కన్నీటి కష్టాలు 1
1/2

కన్నీటి కష్టాలు

కన్నీటి కష్టాలు 2
2/2

కన్నీటి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement