
కూటమి మోసం.. కార్మికులకు ఎగనామం
● పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ● గత వైఎస్సార్సీపీ హయాంలో అమ్మఒడి వర్తింపు ● కూటమి ప్రభుత్వ తీరుపై కార్మికుల ఆగ్రహం ● సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్
నంద్యాల(న్యూటౌన్): ఎన్నికలకు ముందు అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తాం.. సూపర్ సిక్స్తో ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుస్తామంటూ చెప్పిన కూటమి నేతలు చివరకు పేదలను మోసం చేశారు. పారిశుధ్ధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదట్లో మున్సిపల్ కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్రెడ్డి రేషన్ కార్డులను మంజూరు చేయించడంతో పాటు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీ కార్మికులకు పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నారు. ఏటా అమ్మఒడితో పాటు వివిధ పథకాలకు కార్మికులు అర్హత సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వంలో మొదటి ఏడాది తల్లికి వందనం అమలు చేయలేదు. ఏడాది దాటిన తర్వాత ఒక్కొక్కరికి రూ. 2వేలు కోత పెట్టి రూ.13 వేలు జమ చేసింది. అయితే అందులో నగరపాలక సంస్థ కార్మికులను పక్కన పెట్టింది. నంద్యాల మున్సిపాటీలో మొత్తం 500 మంది (అప్కాస్)కార్మికులు ఉన్నారు. కాగా వీరికి తల్లికి వందనం వర్తింపజేయలేదు. దీంతో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పథకాలు అందేవని గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
సంక్షేమ పథకాలకు అర్హత కల్పించండి
ప్రజారోగ్యం కోసం పాటుపడే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు గౌస్, లక్ష్మణ్, భాస్కరాచారి, మల్లికార్జున, తదితరులు కమిషనర్ శేషన్నకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కలెక్టర్ రాజకుమారిని కలసి సమస్యను విన్నవించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కార్మికులు పని చేశారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తల్లికి వందనం వర్తింపజేశారన్నారు. సూపర్ సిక్స్తో జీవితాలను మార్చేస్తామని చెప్పి ఈరోజు పారిశుధ్ధ్య కార్మికులకు కోత విధించడం సరికాదన్నారు. తక్షణం అన్ని పథకాలకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అనర్హత కల్పించాలని డిమాండ్ చేశారు.